రంగారెడ్డి జిల్లాలో దుమ్మురేపిన కారు

సాక్షి, రంగారెడ్డి: జిల్లా పురపోరులో గులాబీ వ్యూహం ఫలించింది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంది. నాలుగు పురపాలికల్లో మెజార్టీ వార్డులను గెలుచుకొని ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కారు...జిల్లా నేతల వ్యూహ రచనతో మరో నాలుగింట గులాబీ జెండాను రెపరెపలాడించింది. శంషాబాద్ , షాద్ నగర్ , శంకర్‌పల్లి, ఇబ్రహింపట్నం, ఆదిభట్ల, తుక్కుగూడ, నార్సింగి, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులు టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కగా... తుర్కయంజాల్ , మణికొండ మున్సిపాలిటీలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది.


ఇక ఆమనగల్ మున్సిపాలిటీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. జల్‌పల్లి మున్సిపాలిటి ఛైర్మన్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకోగా.. వైస్ ఛైర్మన్ పదవి టీఆర్‌ఎస్‌ను వరించింది. కాంగ్రెస్‌కు దక్కుతుందనుకున్న ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్లు... స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎత్తుగడతో టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి చేరాయి. ఆదిభట్ల మున్సిపాలిటికి సంబంధించి 14వ వార్డు సభ్యురాలు కొత్త హార్థిక కాంగ్రెస్ నుంచి గెలిచి అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరి ఛైర్మన్ పదవికి దక్కించుకుంది.


అదే విధంగా పెద్ద అంబర్ పేటలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ మున్సిపాలిటీ ఛైర్మన్ గులాబీవశం కాగా... వైస్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అదే విధంగా జిల్లాలోని మూడు కార్పొరేషన్లు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కాయి. బండ్లగూడ జాగీర్ కార్పోరేషన్ మేయర్‌గా బుర్ర మహేందర్ గౌడ్, బడంగ్‌పేట కార్పొరేషన్ మేయర్‌గా  పారిజాత, మీర్‌పేట మేయర్‌గా ముడావత్ దుర్గా ఎన్నికయ్యారు.